BJP Winning Factors: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి కాషాయ పార్టీ మట్టికరిపించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని కాషాయ జెండా ఎగరడంతో నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.. గత రెండు పర్యాయాలు ఢిల్లీలో అధికారం కోసం కమలం పార్టీ ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ స్ట్రాటజీ సక్సెస్ అయ్యింది. ఢిల్లీలో ఎలాగైనా జెండా పాతాలనే కమలం పార్టీ నేతల కలం సాకారమైంది. మరోవైపు ఢిల్లీలో హ్యాట్రిక్ విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అవినీతే అక్రమాలే అధికారాన్ని దూరం చేశాయనే టాక్ వినిపిస్తోంది.
దశాబ్ధం క్రితం దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓ సంచలనం. అప్పటికే కాకలు తీరిన కాంగ్రెస్ ఢిల్లీ పీఠంపై కూర్చుని ఉంది. ఆ సమయంలో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించిన కేజ్రీవాల్.. ఢిల్లీ పీఠంపై కోలువైన కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. ఢిల్లీ ప్రజలు ఆప్పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మరోసారి గెలిపించారు. అయితే రెండోసారి అధికారం చేపట్టాక ఆప్ పార్టీ నేతలపై అవినీతి కేసులు పెరిగిపోయాయి.. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్స్కామ్ ఆప్ నేతల్ని కటాకటాల వెనక్కి నెట్టింది. ఏకంగా సీఎం కేజ్రివాలే లిక్కర్ కేసులో చుక్కలు చూడాల్సి వచ్చింది. మరోవైపు మనీష్ సిసోడియా, సత్యేంధ్ర జైన్ లాంటి నేతలు ఏడాదికి పైగా జైల్లో గడాపాల్సి వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా ఆప్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీని కాదని ప్రజలు ఆప్ పార్టీకి పట్టం కట్టిన ఢిల్లీ ప్రజలు.. ఇప్పుడు ఆప్ నేతల అవినీతిని కళ్లారా చూసి అధికారానికి దూరం చేశారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు ఆప్ పార్టీ అవినీతిని ఎండగట్టడంలో కమలం పార్టీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ముందే గుర్తించిన మోడీ సర్కార్.. వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో ఆప్ మంత్రులు కీలకంగా ఉండటంతో వాళ్లు జైలుకు వెళ్లారు. అక్కడ మొదలైన ఆప్ పార్టీ పతనం.. క్రమంగా కొనసాగింది. తాజా ఎన్నికల్లో ఆప్ సీఎం కేజ్రివాల్తో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓడిపోవడంతో.. ప్రజలు లిక్కర్ స్కామ్పై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ విషయాలను ఎన్నికలకు ముందే గుర్తించిన కమలం పార్టీ ఆప్ను ఈసారి ఎలాగైనా దెబ్బ కొట్టాలని ప్రణాళికలు రచించింది. ఢిల్లీ ప్రజల మద్దతును కూడగట్టడంలో సక్సెస్ అయ్యింది.
వాస్తవానికి దేశ రాజధానిలో ఆప్ పార్టీ ఓ దశాబ్ధ కాలానికి పైనే అధికారంలో ఉంది. మరోవైపు దేశమంతా గెలిచిన కమలం పార్టీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతోంది. అందుకే ఎలాగైనా కేజ్రీవాల్ను గద్దె దింపేందుకు బీజేపీ అగ్ర నాయకత్వమంతా ఈసారి రంగంలోకి దిగింది. ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రులు, ఇతర రాష్టాల ముఖ్యమంత్రులు సర్వ శక్తులు ఒడ్డారు. ఢిల్లీ గల్లీగల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు ఆప్ ఇచ్చిన హామీలను తలదన్నేలా కమలం పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఓటర్లను ఆకట్టుకుంది. మరోవైపు మైనార్టీ ఓటర్లను చీల్చడంలో కూడా కమలం పార్టీ సక్సెస్ అయ్యిందని అంటున్నారు..
ఇదిలా ఉంటే.. ఢిల్లీలో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ కూడా ఓ కారణమైంది. ఎన్నికలకు ముందు వరకు ఆప్- కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. కానీ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు విడివిడిగా పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి.. అటు బీజేపీకి 47 శాతం ఓట్లు రాగా.. ఆప్ పార్టీకి 43 శాతం ఓట్లు వచ్చాయి.. అంటే రెండు పార్టీలకు ఓట్ల మధ్య తేడా కేవలం 4 శాతం మాత్రమే.. అయితే కాంగ్రెస్-ఆప్ పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్తో కలిసి పోటీ చేసేందుకు నిరాకరించింది. అక్కడ కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఇప్పుడు అదే తప్పును ఆప్ చేసిందని అంటున్నారు. మొత్తంగా రెండు పార్టీలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అయ్యిందన్న చర్చ జరుగుతోంది..
ఏదీ ఏమైనా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడింది. అటు ఓ దశాబ్ధకాలంగా ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలనుకున్న మోడీ కల నెరవేరబోతోంది.. అయితే వచ్చే ఐదేళ్లలో మోడీ సర్కార్ ఢిల్లీలో ఏలా అభివృద్ధి చేస్తుందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఢిల్లీ గద్దెపై కమలం పార్టీ కూర్చోవడంపై మాత్రం ఆ పార్టీ నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read: AP: బాబోయ్ మండే ఎండలు.. వేడి వాతావరణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
Also Read: Telangana Politics: రూట్ మార్చిన ఎమ్మెల్యే.. ఇద్దరు మంత్రులతో స్నేహ హస్తం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.