ఉదయగిరికి తాగునీరు వ్యవస్థపై ఉపరాష్ట్రపతి ఫోకస్.. సీఎం జగన్‌కి ఫోన్

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ( Udayagiri constituency ) ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ( Vice president M Venkaiah Naidu ) సూచించారు.

Last Updated : May 25, 2020, 09:35 PM IST
ఉదయగిరికి తాగునీరు వ్యవస్థపై ఉపరాష్ట్రపతి ఫోకస్.. సీఎం జగన్‌కి ఫోన్

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ( Udayagiri constituency ) ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ( Vice president M Venkaiah Naidu ) సూచించారు. సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ( Niti Aayog CEO Amitabh Kanth ), కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

లాక్ డౌన్ తర్వాత.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను తన దృష్టికి తీసుకొచ్చారని ఉపరాష్ట్రపతి తెలిపారు. భూగర్భజలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని... వరుసగా ఏడో ఏడాది కూడా సరిగ్గా వర్షాలు పడలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఉపరాష్ట్రపతి వివరించారు. కృష్ణానది నుంచైనా లేదా సోమశిల ప్రాజెక్టు నుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు తనని కోరిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల మంత్రిత్వ కార్యదర్శి సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌ వెల్లడించారు.

ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సూచనలకు అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలు చూసుకుని తప్పక ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ ఉపరాష్ట్రపతి ఫోన్లో మాట్లాడారు. ఉదయగిరి ప్రజలు తనతో పంచుకున్న తీవ్ర నీటి ఎద్దడి అంశాన్ని, సోమవారం జల్ శక్తి సీనియర్ అధికారులు, నీతి ఆయోగ్ సీఈవోతో జరిగిన సమావేశం వివరాలను సీఎం వైఎస్ జగన్‌తో పంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ఉదయగిరి సమస్యకు పరిష్కారం లభించవచ్చని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్రంతో కలిసి పనిచేస్తూ ఉదయగిరికి నీటి సమస్య పరిష్కారానికి చొరవతీసుకుంటామని ఉపరాష్ట్రపతికి హామీ ఇచ్చారు.

Trending News