New Income Tax Regime For Central Employees: బడ్జెట్లో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. కొత్త పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందా..? లేదా..? ఇక్కడ తెలుసుకుందాం..
కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. న్యూ ఇన్కం ట్యాక్స్ బిల్లు వచ్చే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు.
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు నో ట్యాక్స్ కింద వస్తారని.. రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
అదేవిధంగా కొత్త పన్ను శ్లాబులను ఆర్థిక శాఖ వెల్లడించారు. ==> రూ.0-4 లక్షలు - సున్నా ==> రూ.4-8 లక్షలు - 5 శాతం ==> రూ.8-12 లక్షలు - 10 శాతం ==> రూ.12-16 లక్షలు - 15 శాతం ==> రూ.16-20 లక్షలు - 20 శాతం ==> రూ.20-24 లక్షలు - 25 శాతం ==> రూ.24 లక్షల పైన 30 శాతం
అదేవిధంగా నాలుగు లక్షలు ఆదాయం దాటిన వారికి 87ఏ ప్రకారం మినహాయింపులు ఉంటాయని నిర్మలమ్మ చెప్పారు. అయితే 87ఏ సెక్షన్లో 12 లక్షల ఆదాయం దాటిన వారికి ఎలాంటి రిబేట్ వర్తించదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్లో ఉన్న జీవోలో ఉందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర సంఘం ఏర్పాటుతో వేతనాలు భారీగా పెరగనున్నాయి. అందులో భాగంగానే కొత్త ట్యాక్స్ విధానం తీసుకువచ్చారని చెబుతున్నారు.
కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల జీతాలు రూ.12 లక్షలు దాటిపోనున్నారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్లో ఈ రకమైన మార్పులు చేశారని చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ విధానంతో 80 శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తిస్థాయి ట్యాక్స్ చెల్లించే పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరో వారంలో పూర్తిస్థాయి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.