MLC Kavitha: మోదీ డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి.. ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమ కుటుంబాన్ని, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం తప్పా.. ముఖ్యమంత్రికి మరో పనిలేదన్నారు. హైడ్రాతో హైదరాబాద్ బ్యాండ్ ఇమేజీ సర్వనాశనం నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Written by - Ashok Krindinti | Last Updated : Feb 27, 2025, 12:36 PM IST
MLC Kavitha: మోదీ డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి.. ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha Slams CM Revanth Reddy: ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని అన్నారు. తాము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు తమనే విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైందన్నారు.
 
"ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం. మేము ఎప్పుడూ ప్రొటొకాల్‌ను ఉల్లంఘించలేదు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేత శక్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్‌చార్జి అని సీఎం చెప్పుకున్నారు. పార్టీ పరంగా ఇన్‌చార్జి అయితే మాకు ఇబ్బంది లేదు. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారు..? తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారు..? రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా..? 

మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారు. గుమ్మడి  నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్‌పై కుట్రలు చేస్తున్నాయి. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారు. 

భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చింది. రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు. నెలకు రూ.6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతున్న సీఎం.. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదు. మరి రూ.6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు..? అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలి. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్రమలో సీఎం ఉన్నారు. రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ప్రతీ నెల 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నార. కానీ కాగ్ ప్రకారం రూ.12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదు 

మరి ఈ అబద్దపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు..? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారు..? ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా.  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం రూ.5800 కోట్లకు పడిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధాన మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కొత్త విషయాలపై వినతులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్ విశాల హృదయం తెలవాలంటే ఎస్ఎల్బీసీ విషయంలో అర్థమవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.   

కరోనా తర్వాత కాంట్రాక్టరు పనులు చేపట్టలేమంటే మళ్లీ 100 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు 3340 కోట్లు. కానీ కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టిన ఖర్చు 3890 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి 11 కీమీ మేర టన్నెల్ తవ్వి చేస్తే ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారు. సొంత జిల్లాలో  సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారు. 8 మంది ప్రాణాలు చిక్కుకుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఉత్తరాఖాండ్‌లో టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లు ప్రాణాలతో బయటపడేవరకు అక్కడే ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రికి దేని మీదా సోయి లేదు.

ఐరన్ లెగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతీగతీ లేదు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదు. మేఘా కృష్ణా రెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లావద్దన్నట్లుగా   సీఎం వ్యవహరిస్తున్నారు. ప్రధానిని కలిసిన వెంటనే బీఆర్ఎస్ పని ఖతమని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. మరి వీటన్నింటికి మా కుటుంబానికి, మా పార్టీకి సంబంధం ఏంటి..? ఇది కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై సీఎం కుట్ర పన్నడమే కానీ మరొకటి కాదు. సంబంధం లేని సంఘటనల గురించి ప్రధానిని కలిసిన తర్వాత సీఎం మాట్లాడారు. దీన్ని బట్టే కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతున్నది.." అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 

Trending News