Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనం వచ్చే భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఓ వ్యక్తి ఎన్ఆర్ఐ భక్తులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. తాను టీటీడీ పీఆర్ఓ అంటూ చెప్పుకుంటూ చెలామణి అవుతున్నాడు. వసూళ్లకు పాల్పడుతున్నాడు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు ఓ ఘరానా మోసగాడు. తాను టీటీడీ పీఆర్ఓ అంటూ బీఆర్ నాయుడు ఫోటోలు వాట్సాప్ డీపీగా పెట్టుకొని 'తిరుమల సమాచారం' అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ తథంగం నడుపుతున్నాడు.
ఎన్నారై భక్తులను మోసం చేస్తూ టికెట్లు ఆశ చూపుతున్నాడు. వారిని పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు.. డబ్బు దండుకున్న తర్వాత వారిని వాట్సాప్ గ్రూప్ నుంచి నెంబర్ డిలీట్ చేస్తున్నాడు.
ఇలా ఓ ఎన్నారై భక్తుడు గోపాల్ రాజు చైర్మన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన చైర్మన్ విజిలెన్స్ అధికారులకు అలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అయితే విచారణలో సదరు నిందితుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు. దీంతో అప్రమత్తమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.. ఇలా భక్తులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు.
అంతేకాదు భక్తులు కూడా ఇలా అబద్దపు ప్రచారాలను నమ్మకూడదని.. కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. నకిలీ వెబ్సైట్లు కూడా కోకొల్లలు వాటిపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు.